Monday, February 23, 2015

ధనానికి మూడే గతులు

ధనానికి మూడే గతులు
Posted On:2/21/2015 1:36:50 AM
ధనవంతుని వద్దనున్న ధనం దానం చేయుటకు ఉపయోగపడును. అట్లే పంచభక్ష్యపరమాన్నాలను సమకూర్చుకొనుటకు, సుగంధపరిమళద్రవ్యాలను, హార చందనాదులను, సుందరమైన వస్త్రములను కొనుటకు, సుఖనివాసమునకు అవసరమైన భవన నిర్మాణమునకు, అలంకరించుకొనదగిన ఆభరణములను పొందుటకు, ఇష్టమైన అవసరమైన ప్రదేశాలలో సంచరించుటకు కావలసిన వాహనములను కొనుటకు ఉపకరిస్తూ ధనికునియొక్క భోగానుభవమునకు కారణమై నిలుచును.
దానధర్మాలకు, అనుభవం కోసం ధనాన్ని ఉపయోగించకపోతే ఆ ధనం నశిస్తుందని, ధనానికి దానము, భోగము, నాశము అనే మూడు గతులే ఉన్నాయి
దానం భోగో నాశః తిస్రో గతయో భవంతి విత్తస్య
యో న దదాతి, న భుంక్తే తస్య తృతీయా గతిర్భవతి ॥
అని భర్తృహరి మహాకవి పేర్కొన్నాడు.
రాశులకొద్ది ధనం ఉన్న వ్యక్తి తన దగ్గర ఉన్న ధనాన్ని తన అవసరాలకో, తన పరివారం యొక్క అనుభవానికో ఏ మాత్రం ఉపయోగించకపోతే, ఆపదలో ఉన్నవారికి, ఆకలితో అలమటించేవారికి, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారికి సహాయంగా అందించకపోతే, విద్వాంసులను, కళాకారులను సత్కరించుటకు, దేవాలయ నిర్మాణమునకు, యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించుటకు వీలుగా దానంగా ధర్మంగా సమర్పించకపోతే ఆ ధనరాశులు ఇతరుల వశమయ్యే ప్రమాదమున్నది.
పంట పొలాల్లో గడ్డితో తయారుచేసి పెట్టే దిష్టిబొమ్మ పంటకు కాపలాగా ఉంటుంది. పొలం యజమాని శ్రేయస్సు కోసం ఉపయోగపడుతుంది. అంతేకానీ ఆ పంటను అనుభవించదు. అట్లే ధనాన్ని తాననుభవించక, ఇతరులకు దానం చేయకుండా ఉండే వ్యక్తి కూడా బొమ్మవలె ధనానికి కాపలాదారుగా మాత్రమే ఉంటాడు తప్ప యజమానిగా ఉండడు.
యో న దదాతి, న భుంక్తే విభవే సతి నైవ తస్య తద్ద్రవ్యమ్‌
తృణ కృత కృత్రిమపురుషః రక్షతి సస్యం పరస్యార్థే ॥ అని చెప్పబడినది.
సత్కార్యాలకు దానంగా ఉపయోగించడం, ధనానికి సద్గతి. యజమానికి, అతని పరివారానికి ఉపకరించడం సహజగతి. దుర్జనుల వ్యసనాలను తీర్చుకోవడానికి, దుర్మార్గులు ఆక్రమించుకోవడానికి, విలువ తెలియనివారి చేతికి చిక్కి నిరుపయోగంగా పడివుండడానికి కారణమయ్యే ధనం అధోగతిని పొందినట్లగును.

No comments:

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular